కేప్ కెనవెరల్: కొన్ని రోజుల క్రితం వోయేజర్ 2(Voyager 2)స్పేస్క్రాఫ్ట్తో సిగ్నల్ సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ సిగ్నల్స్ను మళ్లీ పునరుద్దరించినట్లు నాసా పేర్కొన్నది. సుమారు 12 బిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న స్పేస్క్రాఫ్ట్ వోయేజర్-2తో జూలైలో లింక్ తెగిపోయింది. ఆ వ్యోమనౌకకు ఉన్న యాంటినా పక్కకు జరగడంతో.. భూమికి రావాల్సిన సిగ్నల్స్ అందలేదు. దీంతో నాసా శాస్త్రవేత్తలు ఆ సిగ్నల్స్ను పునరుద్దరించే ప్రయత్నం చేశారు. బుధవారం రోజున నాసాకు చెందిన డీప్ స్పేస్ నెట్వర్క్ కొత్త సిగ్నల్స్ను పంపింది. ఆ కమాండ్కు వోయేజర్ 2 స్పందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ఉన్న హై పవర్ ట్రాన్స్మిటర్ ద్వారా రేడియో సిగ్నల్స్ పంపారు.
వోయేజర్కు సిగ్నల్ చేరడానికి కనీసం 18 గంటల సమయం పడుతుంది. అయితే సుమారు 37 గంటల తర్వాత ఆస్ట్రేలియా నుంచి పంపిన సిగ్నల్ అందినట్లు మిషన్ కంట్రోలర్స్ ద్వారా వెల్లడైంది. వోయేజర్ 2 నుంచి సైన్స్, టెలీమెట్రీ డేటా మళ్లీ అందడం ప్రారంభమైనట్లు నాసా తెలిపింది. ప్రస్తుతం ఆ వ్యోమనౌక నార్మల్గానే ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. అనుకున్న కక్ష్యలోనే అది వెళ్తోందన్నారు.
జూలై 21వ తేదీన వోయేజర్కు వరుసగా నాసా సిగ్నల్స్ పంపింది. దీంతో దాని యాంటినా రెండు డిగ్రీలు పక్కకు జరిగింది. దాని వల్ల భూమికి ఆ స్పేస్క్రాఫ్ట్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ రాలేదు. కమాండ్లను కూడా అది అందుకోలేదు. వోయేజర్ యాంటినాను భూమి వైపు చూసేందుకు ప్రోగ్రామ్ను రీసెట్ చేస్తారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన మరోసారి వోయేజర్2 యాంటినాను రీసెట్ చేయనున్నారు.