ఒట్టావా: తాలిబన్లు ఉగ్రవాదులని, ఆ జాబితాలో ఉన్న వారిని అలాగే గుర్తిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాలిబన్లపై ఆంక్షల గురించే చర్చిద్దామని జీ7 నేతలకు పిలుపునిచ్చారు. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాతో కూడిన జీ7 సంపన్న దేశాల సమూహం అధినేతలు ఆఫ్ఘనిస్థాన్పై చర్చించేందుకు మంగళవారం వర్చువల్గా సమావేశం కానున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తమ దేశ అభిప్రాయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ మేరకు వ్యక్తం చేశారు. ఉగ్రవాదులైన తాలిబన్లపై ఆంక్షల విధింపుపైనే మాట్లాడదామని సూచించారు. ఆఫ్ఘన్ నుంచి వీలైనంత మందిని సురక్షితంగా తీసుకురావడంపైనే ప్రస్తుతం తాము దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
కాగా, ఆఫ్థనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో కొత్త ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ విధానం కింద 20,000 మంది ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని కెనడా ఇటీవల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు వెయ్యి మంది ఆఫ్ఘన్లు కెనడా చేరుకున్నారు. మరోవైపు ఆదివారం నాలుగు విమానాల్లో 436 మంది కెనడా, ఆఫ్ఘన్ జాతీయులను కాబూల్ నుంచి ఆ దేశానికి తరలించారు.