జెనీవా, మే 19: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పేద దేశాలకు అవి అందని ద్రాక్షలాగే మిగిలిపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఆవేదన వ్యక్తంచేశారు. 1990వ దశకంలో హెచ్ఐవీకి (ఎయిడ్స్కు) వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చినా, దాన్ని భరించే స్థోమత లేక భారత్లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎయిడ్స్కు చికిత్స ఖర్చు ఒక్కొక్కరికి ఏడాదికి పదివేల డాలర్లు అయ్యేదని, ఈ వ్యయం తగ్గి పేద దేశాల్లో అందుబాటులోకి రావడానికి దశాబ్దం పట్టిందని చెప్పారు. తన రోగులు తన కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్నా చూస్తూ ఉండాల్సి వచ్చిందన్నారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ తన కళ్లముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు. అప్పటిలాగే.. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి పేద దేశాలకు అందడం లేదన్నారు. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పేద దేశాలకు టీకాలు అందించేందుకు కొవాక్స్ కూటమిని ఏర్పాటుచేసినా, తగిన స్థాయిలో నిధులు అందుబాటులో లేవని తెలిపారు. మరోవైపు, వైరస్ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టమని చెప్పారు. వైరస్ ఉత్పరివర్తనాలు, వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం, ఇమ్యూనిటీ కొనసాగే వ్యవధిపై ఇది ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొవాక్స్ ద్వారా ఈ ఏడాది చివరినాటికి ప్రపంచంలో 30శాతం జనాభాకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సౌమ్య స్వామినాథన్ చెప్పారు.