కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్సలపై లంక సుప్రీంకోర్టు ట్రావెల్ బ్యాన్ విధించింది. జులై 28 వరకూ వీరు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లరాదని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం ఆదేశించింది. ఇక అధ్యక్ష పదవికి గొటబయ రాజపక్స రాజీనామా ఆమోదించడంతో ప్రదాని రణిల్ విక్రమసింఘె శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంట్ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే తాత్కలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వచ్చే వారం పార్లమెంట్ సమావేశమై నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని శ్రీలంక స్పీకర్ తెలిపారు. శ్రీలంక ఆర్ధిక సంక్షోభం తీవ్రతరమవడంతో మాజీ అధ్యక్షుడు గొటబయ గతవారం మాల్దీవులకు పరారైన సంగతి తెలిసిందే.
ఇక శ్రీలంక పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఐఎంఎఫ్ ప్రతినిధి గెరీ రైస్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ సహాయ కార్యక్రమంపై లంకతో చర్చలు పునరుద్ధరించేలా అక్కడి పరిస్ధితులు చక్కబడతాయని తాము ఆశిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.