రోమ్: కోవిడ్తో సతమతమైన యురోపియన్ యూనియన్ దేశాలకు రికవరీ కోసం ఏర్పాటు చేసిన నిధుల్లో భారీగా అవకతవకలు(Covid-19 fraud) జరిగాయి. ఆ ఘటనలో 22 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 650 బిలియన్లడ డాలర్ల అసెట్స్ను సీజ్ చేశారు. ఇటలీ, ఆస్ట్రియా, రొమేనియా, స్లోవేకియా దేశాల్లో ఆ అరెస్టులు జరిగాయి. దోషుల నుంచి లాంబోర్గిని, పోర్సె కార్లతో పాటు రోలెక్స్ వాచీలు, కార్టియల్ జ్వలరీ, క్రిప్టోకరెన్సీలు, లగ్జరీ విల్లాలు, ఇంకా పలు రకాల వస్తువులను సీజ్ చేశారు.
కోవిడ్తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలను పునరుత్తేజం చేసేందుకు 2021 సంవత్సరంలో యురోపియన్ యూనియన్ సుమారు 800 బిలియన్ల యూరోల ఫండ్ను ఏర్పాటు చేసింది. దీంట్లో ఇటలీ దేశం ఎక్కువ శాతం లబ్ధి పొందింది. ఆ దేశానికి సుమారు 194 బిలియన్ల పౌండ్ల నిధులు వెళ్లాయి. అయితే ఓ క్రిమినల్ సంస్థ 2021 నుంచి 2023 మధ్య ఫ్రాడ్ స్కీమ్ను నడిపిట్లు యురోపియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీసు పేర్కొన్నది.
ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తామని చెప్పి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు. చిన్న, మధ్య తరగతి కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు నిధుల్ని రిలీజ్ చేసి, ఆ సొమ్మును కొందరు క్రిమినల్స్ తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. తప్పుడు బ్యాలెన్స్ షీట్లను చూపించారు. యాక్టివ్గా లేని కంపెనీలను చూపించి, డబ్బును లాగేశారు.
ఇటలీ నేషనల్ రికవరీ, రిసైలెన్స్ ప్లాన్ నుంచి సుమారు 600 మిలియన్ల పౌండ్ల నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రిమినల్ గ్రూపు ఆస్ట్రేలియా, రొమేనియా, స్లోవేకియా దేశాల్లో తమ బ్యాంకు అకౌంట్లకు నిధుల్ని దారిమళ్లించినట్లు గుర్తించారు.