King Charles : బ్రిటన్ రాణి (Britain Queen) ఎలిజబెత్-2 (Elizebeth-2) మరణంతో 2023 మే నెలలో కింగ్ చార్లస్-3 (King Charles) రాజయ్యాడు. ఈ సందర్భంగా రాజు పట్టాభిషేకానికి ఏకంగా 72 మిలియన్ పౌండ్లను ఖర్చు చేశారు. మన భారతదేశ కరెన్సీలో ఇది ఏకంగా రూ.765 కోట్లు. ఈ మేరకు బ్రిటన్ సర్కారు ఒక నివేదికను వెల్లడించింది.
బ్రిటన్ రాజుగా చార్లెస్కు గత ఏడాది మే 6న పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్కు 40వ చక్రవర్తిగా ఆయన గుర్తింపు పొందారు. వెస్ట్మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ పట్టాభిషేకం వేడుక జరిగింది. ఈ వేడుకలకు భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కఢ్ హాజరయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా ప్రతినిధులు తరలి వెళ్లారు.
పట్టాభిషేకం వేడుక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని, పోలీసింగ్ కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని బ్రిటన్ సాంస్కృతిక శాఖ తెలిపింది. కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019లో కూడా ఆయన భారత్కు వచ్చారు.
ఆ సందర్భంగా ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పారు. 2018 ఏప్రిల్లో ఆయన లండన్లో భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు.
అంతేగాక భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చార్లెస్-3 చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. కొద్ది రోజుల క్రితం కూడా చార్లెస్ దంపతులు వారం రోజులపాటు బెంగళూరులో పర్యటించి వెళ్లారు.