Britain Princess : బ్రిటన్ యువరాజు (Britain Prince) విలియమ్ (William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princes of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) సరికొత్త ఘనత సాధించారు. కేవలం 24 గంటల్లోనే మూడు శిఖరాలను అధిరోహించారు. ఏడాది క్రితమే క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె.. ఓ ఛారిటీ కోసం ఈ శిఖరాలను ఎక్కారు. ఈ విషయాన్ని రాజకుటుంబానికి (UK Royal Family) చెందిన సోషల్ మీడియా ఖాతా (Social Media) లో ఆమె పంచుకున్నారు.
‘నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్’ లో భాగంగా కేట్ మిడిల్టన్ ఈ శిఖరాలను అధిరోహించారు. 24 గంటల వ్యవధిలో స్కాట్లాండ్లోని బెన్ నెవిస్, ఇంగ్లండ్లోని స్కాఫెల్ పీక్, వేల్స్లోని స్కోడౌన్ శిఖరాలను ఎక్కారు. మొత్తం 37 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి ఆమె ఈ ఛాలెంజ్ను పూర్తిచేశారు. ‘క్యాన్సర్ కేవలం శరీరంపై మాత్రమే ప్రభావం చూపించదు. మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. ఇది నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నా. క్యాన్సర్ నుంచి బయటపడాలంటే కేవలం మందులొక్కటే సరిపోవని అర్థం చేసుకున్నా. అందుకే ఈ ఛాలెంజ్ను స్వీకరించా. ఆ మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత జీవితం ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకే ప్రయత్నించా’ అని కేట్ ఈ పోస్ట్లో రాసుకొచ్చారు.
‘క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఛాలెంజ్లో పాల్గొన్నా. ఈ వ్యాధి నుంచి కోలుకోవడం అంటే కేవలం ఆరోగ్యంగా మారడం మాత్రమే కాదు. జీవితం ఎంత సమతుల్యంగా ఉండాలో అర్థం చేసుకోవడం కూడా. ప్రయత్నం, అంగీకారం, నమ్మకం, ఆలోచన ఉంటేనే దీని నుంచి బయటపడగలం. చివరగా మనం జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఒక్కటే సరిపోదు. మనం ప్రయాణిస్తున్న మార్గంలో ఎన్ని అడ్డుంకులు ఎదురైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నిలకడగా ఉంటేనే సాధ్యమవుతుంది’ అని తెలిపారు.
తాను క్యాన్సర్ బారిన పడినట్లు 2024 మార్చిలో కేట్ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె.. ఆసుపత్రిలో పలు దశల వారీగా కీమోథెరపీ చేయించుకున్నారు. ఈ మహమ్మారి నుంచి తాను పూర్తిగా బయటపడినట్లు గత ఏడాది జనవరిలో వెల్లడించారు. అప్పటి నుంచి క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.