ఇస్లామాబాద్ : కరాచీ వర్సిటీలో ఆత్మాహుతి దాడికి పాల్పడి ముగ్గురు చైనీయులతో పాటు నలుగురి మృతికి కారణమైన సూసైడ్ బాంబర్ గురించి షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. 30 ఏండ్ల షరి బలోచ్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేసి ఓ వైద్యుడిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారని ఆమె సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తోందని దాడికి తమదే బాధ్యతని ప్రకటించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. బలూచిస్తాన్లోని నియాజర్ అబద్ ప్రాంతానికి చెందిన షరి బలోచ్ రెండేండ్ల కిందట బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్కు చెందిన స్పెషల్ సెల్ఫ్ శాక్రిఫైజ్ బృందంలో చేరింది.
ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఈ బృందం నుంచి తప్పుకునేందుకు ఉగ్ర సంస్ధ అనుమతించినా ఆమె తిరస్కరించిందని బీఎల్ఏ పేర్కొంది. బలూచిస్తాన్, పాకిస్తాన్లో చైనా పౌరులు, చైనా ప్రయోజనాలను దెబ్బతీసే టార్గెట్తో ముందుకెళతామని మజీద్ బ్రిగేడ్ హెచ్చరించింది. కాగా, కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది. చైనా పౌరులు, డ్రాగన్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మిలిటెంట్ గ్రూప్ బీఎల్ఏ కార్యకలాపాలు సాగిస్తోంది.
మహిళా సూసైడ్ బాంబర్ ఈ దాడికి పాల్పడిందని బీఎల్ఏ పేర్కొంది. సూసైడ్ బాంబర్ను షరి బలూచ్గా గుర్తించినట్టు ఓ ప్రకటనలో బీఎల్ఏ పేర్కొంది. షరి మిలిటెంట్ గ్రూప్లో తొలి మహిళా బాంబర్ అని వెల్లడించింది. బలూచ్ ప్రతిఘటన చరిత్రలోనే ఈ దాడి నూతన అధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొంది. జులై 2021లో దసు ప్రాంతంలో బస్పై జరిగిన దాడిలో తొమ్మిది మంది చైనీయులు మరణించిన తర్వాత చైనా పౌరులు లక్ష్యంగా పాకిస్తాన్లో భారీ దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ దాడి తాము చేపట్టలేదని అప్పట్లో బలూచ్ మిలిటెంట్లు ప్రకటించగా ఈ దాడి తమ పనేనని తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్గా పేరొందిన పాకిస్తాని తాలిబన్ సంస్ధ వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్తానీలూ మరణించారు.