Kabul hotel : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక హోటల్లో ముగ్గురు సాయుధాలు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో సెక్యూరిటీ అధికారులు ముగ్గురిని హతమార్చారని తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాబూల్లోని లాంగాన్ హోటల్లో చైనీయులు ఎక్కువగా ఉంటారు. వాళ్లను లక్ష్యంగా చేసుకొని సాయుధులై ముగ్గురు మధ్యాహ్నం 2ః30 గంటలకు కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. భద్రతా పరమైన అంశాల మీద చర్చిందేందుకు చైనా దైత్యవేత్త అఫ్గాన్ విదేశీ వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ను కలిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. అంతేకాదు ఈ హోటల్కు సమీపంలోనే చైనా రాయబార కార్యాలయం ఉంది. దాంతో కాబూల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చైనాకు చెందిన గ్జిన్హు వార్తా సంస్థ తెలిపింది.
దాడి సమయంలో హోటల్ నుంచి దట్టమైన పొగ వెలువడింది. దాంతో హోటల్లో ఉన్నవాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. కాల్పుల నుంచి తప్పించుకనే క్రమంలో ఇద్దరు విదేశీయులు బాల్కనీ నుంచి కిందకు దూకి గాయపడ్డారని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారని కాబూల్లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ తెలిపింది. తుపాకీ చప్పుళ్లు వినిపించిన తర్వాత హోటల్లో పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు.
కాబూల్లో ఈమధ్య బాంబు దాడి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్ దౌత్య కార్యాలయం మీద కొందరు దుండగులు దాడి చేశారు. సెప్టెంబర్ నెలలో రష్యా ఎంబసీ ఆఫీస్ మీద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ రెండు దాడులను తామే చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.