కావన్.. ఒకప్పుడు ప్రపంచంలోనే ఒంటరి ఏనుగు. ఇప్పుడు కంబోడియా వన్యప్రాణుల అభయారణ్యంలో ఇతర జంతువులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సంతోషంగా, స్వేచ్ఛగా, ప్రేమతో జీవనాన్ని గడుపుతోంది. సరస్సులో జలకాలాడుతున్న ఏనుగు వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్’ ఇన్స్టాలో షేర్చేసింది. ఈ వీడియోలోని ఏనుగు కావన్.. పాకిస్తాన్లోని జంతుప్రదర్శనశాలలో ఎనిమిదేళ్లు ఒంటరిగా గడిపింది. ఈ ఏనుగును శ్రీలంక 1985లో పాకిస్తాన్కు బహుమతిగా ఇచ్చింది. ‘సహేలీ’ అనే ఏనుగుతో కలిసి 22 ఏళ్లు ఆనందంగా గడిపింది. అయితే, 2012లో సహేలీ మృతిచెందడంతో కవన్ ఒంటరిదైపోయింది. అప్పటినుంచీ ఒంటరిగా జీవించింది.
ఈ ఏనుగును వన్యప్రాణి అభయారణ్యంలో వదిలిపెట్టాలని అమెరికన్ గాయకుడు చెర్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని లేవదీశాడు. పాకిస్తాన్ జంతుప్రదర్శనశాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేసుకూడా పెట్టాడు. దీంతో మే, 2020లో ఇస్లామాబాద్ హైకోర్టు కావన్తో పాటు 38 ఇతర జంతువులను అభయారణ్యాలకు తరలించాలని తీర్పునిచ్చింది. అదే సంవత్సరం నవంబర్ 30న కంబోడియా వన్యప్రాణుల అభయారణ్యానికి వీటిని తరలించారు. అప్పటినుంచీ కావన్ ఇతర జంతువులతో కలిసి సంతోషంగా జీవిస్తున్నది. ఇటీవల కావన్ సరస్సులో ఆడుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆనందపడ్డారు.