వాషింగ్టన్: లైవ్ రిపోర్ట్ ఇస్తున్న మహిళా టీవీ రిపోర్టర్ను ఒక కారు ఢీకొట్టింది. అయినప్పటికీ ఆమె తన రిపోర్టింగ్ను కొనసాగించింది. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన జరిగింది. వెస్ట్ వర్జీనియా టెలివిజన్ న్యూస్ రిపోర్టర్ యోర్గీ, బుధవారం ఒక రోడ్డు ప్రమాదం గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంతలో ఒక కారు వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. అయితే ఒంటరిగా లైవ్ రిపోర్ట్ ఇస్తున్న యోర్గీ దానిని కొనసాగించారు. కారు ఢీకొనడంతో కిందపడిన ఆమె పైకిలేస్తూనే న్యూస్ యాంకర్ టిమ్ ఇర్తో మాట్లాడారు. “ఓ మై గాడ్! నన్ను ఇప్పుడే కారు ఢీకొట్టింది, కానీ నేను ఓకే టిమ్.” అని ఆమె అన్నారు.
కాగా, ఇది మీకు తొలి ప్రమాదమా అంటూ న్యూస్ యాంకర్ టోరీ ప్రతిస్పందించారు. అయితే కాలేజీలో కూడా తనను ఇలానే ఒక కారు ఢీకొట్టిందని టీవీ రిపోర్టర్ యోర్గీ తెలిపారు. తాను బాగానే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి, వావ్ అంటూ టిమ్ ప్రతిస్పందించారు. మీరు కెమేరా స్క్రీన్ నుంచి కనిపించకపోవడాన్ని తాను చూశానని, బాగా దెబ్బలు తగిలాయా? అని ఆయన అడిగారు. “నాకు తెలియదు టిమ్. నా జీవితమంతా నా కళ్ల ముందు మెరిసింది” అని ఆ మహిళా జర్నలిస్ట్ బదులిచ్చింది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు, తోటి రిపోర్టర్లు యోర్గీ అంకిత భావాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. జర్నలిస్టులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ సంఘటనను ఒక ఉదాహరణగా కొందరు పేర్కొన్నారు.