అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి జోబైడెన్ రష్యా- ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఆయన నోరు జారారు. ఉక్రెయిన్ ప్రజలు అనే బదులు.. ఇరానియన్ ప్రజలు అంటూ అనేవారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై జోక్స్ వేసుకుంటున్నారు. ట్విట్టర్లో Iranian ట్రెండ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తలుచుకుంటే.. కీవ్ను యుద్ధ ట్యాంకర్లతో చుట్టుముట్టగలడు. కానీ.. ఇరాన్ ప్రజల హృదయాలను మాత్రం ఇక ఎప్పటికీ గెలుచుకోలేడు. అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ఇరాన్ స్థానంలో ఉక్రెయిన్ అనాలి.
అమెరికా ఉభయసభలను ఉద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడిన ఆయన ఆ మారణహోమానికి పుతిన్ కారణమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. పుతిన్ ప్రభుత్వం అవినీతి అధికారులు, వ్యాపారవేత్తలతో భ్రష్టుపట్టిందన్నారు. రష్యాపై పోరులో యూరోప్ దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.రష్యాకు చెందిన రాజకీయ సంపన్నుల వివరాలను తాము సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిపై త్వరలో ఆంక్షలను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో అమెరికా, నాటో దేశాలు ఒక్కటిగా ఉన్నట్లు జోబైడెన్ చెప్పారు.