వాషింగ్టన్: తప్పుడు సమాచారంతో ఫేస్బుక్.. ప్రజల్ని చంపేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్పై అనవసరమైన సమాచారం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ టీకాల పంపిణీపై సోషల్ మీడియాలో చాలా దారుణమైన రీతిలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని బైడెన్ తెలిపారు. ఫేస్బుక్ లాంటి ఫ్లాట్ఫామ్ల్లో.. వ్యాక్సిన్లు, మహమ్మారిపై తప్పుడు ప్రచారం సాగుతోందని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
వ్యాక్సినేషన్పై అమెరికాలో జరుగుతున్న దుష్ ప్రచారాన్ని అరికట్టేందుకు శ్వేతసౌధం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా సంస్థలపై వత్తిడి తెచ్చేందుకు వైట్హౌజ్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్రజల్ని చంపేస్తోందని, కేవలం వ్యాక్సిన్ వేసుకోనివారి వల్లే మహమ్మారి వ్యాపిస్తోందని బైడెన్ అన్నారు. అయితే ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతోనే తాము సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నామని ఫేస్బుక్ చెప్పింది. బైడెన్ చేసిన ఆరోపణలను ఫేస్బుక్ ఖండించింది.
అమెరికాలో కోవిడ్ మరణాలు, ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్ల.. వ్యాక్సిన్ వేసుకోనివారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు చెప్పారు. చాలా మందికి నమ్మకం కలగకపోవడం వల్లే వాళ్లు వ్యాక్సిన్లు వేసుకోవడం లేదని, దాంతో కావాల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. అమెరికన్లు వ్యాక్సిన్ల పట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారమే కారణమని భావిస్తున్నారు.
ఆన్లైన్లో యాంటీ వ్యాక్సిన్ కార్యకర్తలు పోస్టులు చేయడం వల్ల వ్యాక్సినేషన్పై విమర్శలు వస్తున్నాయి. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలు తప్పుడు వార్తలను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని వైట్హౌజ్ మీడియా ప్రతినిధి జెన్ పాకి తెలిపారు. కచ్చితమైన సమాచారం ఇవ్వడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో 12 మంది కనీసం 65 శాతం యాంటీ వ్యాక్సిన్ ప్రచారం చేస్తున్నట్లు వైట్హౌజ్ ఆరోపించింది. వాళ్లంతా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నారని, వాళ్లను ఇతర ఫ్లాట్ఫాముల్లో బ్యాన్ చేసినా.. అదే తరహా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వైట్హౌజ్ ఆరోపించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలతో తాము చలించబోమని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.