టోక్యో: ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్(Fukushima Nuclear Plant) నుంచి అణుధార్మిక వ్యర్థ జలాలను రిలీజ్ చేయడం ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మిలియన్ టన్నుల రేడియోయాక్టివ్ జలాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ అణు ప్లాంట్కు చెందిన తాజా ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అణు ప్లాంట్ నుంచి నీటిని డిస్చార్జ్ చేస్తున్న దృశ్యాలు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లూ స్టోర్ చేసిన ట్రిటియంతో పాటు ఇతర రేడియోయాక్టివ్ ఐసోటోప్లను పసిఫిక్ మహాసముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాత శుద్ధి చేసిన నీటిని సముద్రంలోకి వదులుతున్నారని యూఎన్ అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. మరో వైపు మాత్రం పలు దేశాలు ఆ జలాలను సముద్రంలోకి వదలడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సౌత్ కొరియాతో పాటు చైనా దేశాలు ఈ చర్యను ఖండిస్తున్నాయి. దక్షిణ కొరియాలో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఇక జపాన్కు చెందిన సీ ఫుడ్ను చైనా బ్యాన్ చేసింది.
2011లో వచ్చిన శక్తివంతమైన భూకంపం ద్వారా ఫుకుషిమా-దైచి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ధ్వంసమైంది. ఆ ప్లాంట్లో ఉన్న మూడు రియాక్టర్లు శిథిలమయ్యాయి. ఆ నాటి సునామీ వల్ల 18 వేల మంది మృతిచెందారు. ప్లాంట్లో జరిగిన రసాయనిక పేలుళ్ల వల్ల బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో రేడియోధార్మిక వ్యర్ధాలు లీక్కావడం మొదలైంది. ఇక ఆ ప్రాంతం నుంచి జనాల్ని తరలించేశారు. సునామీ తర్వాత ఆ ప్లాంట్లో ఉన్న 46 రియాక్టర్ల ఆపరేషన్ను నిలిపివేశారు.
శుద్ధి చేసిన నీటిలో ట్రిటియం స్థాయి ప్రమాణాలకు తగినట్లు ఉందని జపాన్ చెబుతోంది. ఫుకుషిమా జలాల్లో ఆ ట్రిటియం స్థాయి లీటరుకు 1500 బెక్వెరల్గా ఉన్నట్లు తేల్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం తాగునీటి స్థాయిలో ఉండే దాని కన్నా ఆరు రెట్లు తక్కుగానే ట్రిటియం ఉన్నట్లు జపాన్ పేర్కొన్నది. ఓ అండర్వాటర్ టన్నెల్ ద్వారా ప్రస్తుతం సముద్రంలోకి అణుధార్మిక జలాల్ని రిలీజ్ చేస్తున్నారు.
ఫుకుషిమా ప్లాంట్లో ప్రస్తుతం 1.3 మిలియన్ టన్నుల రేడియోయాక్టివ్ నీరు ఉంది. ఇది దాదాపు 500 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ను నింపగలదు. సాధారణంగా ట్రిటియం హానికరం కాదు. కానీ మోతాదు మించితే మాత్రం దాని వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సముద్రంలోకి రిలీజ్ చేస్తున్న నీరుతో స్ట్రోన్టియమ్-90, ఐయోడిన్-129, కార్బన్-14 కూడా ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.