టోక్యో : కరోనా వైరస్ కేసులు రికార్డు స్ధాయిలో పెరుగుతుండటంతో టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో జపాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రధాని సుగ ప్రకటించారని జపాన్ ప్రధాని కార్యాలయం శనివారం వెల్లడించింది. హొక్కైడొ, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక ప్రాంతాలకు వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపింది.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని ప్రయాణాలకు దూరంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని పీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని కోరింది. ఆగస్ట్ మాసాంతానికి 40 శాతం ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు అందించే దిశగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపింది.
కొవిడ్ బారినపడిన 50 ఏండ్లు పైబడిన వారు తీవ్ర లక్షణాలకు లోనుకాకుండా మెరుగైన చికిత్సను ప్రభుత్వం ఆయా రోగులకు అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొంది. వైరస్ ఇన్ఫెక్షన్లను నివారించడం, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడానికి అన్ని చర్యలూ చేపడతామని తెలిపింది.