జపాన్ వాసులను ఓ వైపు ఆనందం మరోవైపు టెన్షన్కు గురవుతున్నారు. ఎందుకలా అంటే చెర్రీ చెట్ల పూలు సీజన్ కన్నా ముందే వచ్చేశాయి. ఎప్పుడూ ఏప్రిల్లో ఈ చెట్ల పూలు వికసిస్తాయి. అప్పుడే పిల్లలకు స్కూళ్లు కూడా తెరుస్తారు. అలా వికసించిన పూల గుబాళింపుతో రోడ్లన్నీ మంచి సువానని సంతరించుకుంటాయి.
అందుకే ఈ సీజన్ని ఓ పండుగలా చేసుకుంటారు జపాన్ వాసులు. పిల్లా పెద్దా అందరూ కలిసి చెర్రీ చెట్ల పూల మధ్య ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. ఓ రకంగా చెప్పాలంటే కార్తీకమాసంలో మనం వన భోజనాలు చేస్తాము కదా.. అలాగే ఏప్రిల్లో జపాన్ వాసులంతా చెర్రీచెట్ల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారు.
ఈసీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉండే ఈ చెర్రీ చెట్ల పూల సువాసనలను ఆస్వాదించడానికి ఈ అందాలను చిత్రీకరించడానికి దేశ విదేశాలనుంచి పర్యాటకులు జపాన్కు వస్తుంటారు. పింక్ అండ్ వైట్ లో ఉండే ఈ పూలను సకురా అని కూడా పిలుస్తారు. 1200 ఏళ్ల తర్వాత ఈ పూలు పూసే సీజన్ కాస్త ముందు రావడం ఇదే మొదటిసారి అంటున్నారు జపాన్ వాతావరణ నిపుణులు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్ అని చెబుతున్నారు.