న్యూఢిల్లీ: అమెరికాలోని సియాటిల్ నగరంలో పోలీసు వాహనం ఢీకొనడంతో తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల(Jaahnavi Kandula) మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో.. ఓ పోలీసు ఆఫీసర్ తన వాహనంలో మాట్లాడుతూ.. జాహ్నవి మృతి పట్ల నవ్వుకున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 23వ తేదీన జరిగిన ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఆఫీసర్ కెవిన్ డేవ్ ఆ కారును డ్రైవ్ చేశాడు. బాడీకామ్ ఫూటేజ్ను సోమవారం సియాటిల్ పోలీసులు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం గంటకు 119 కిలోమీటర్లుగా ఉంది. ఇక కారు ఢీకొన్న తర్వాత జాహ్నవి శరీరం దాదాపు వంద అడుగుల దూరంలో పడింది. జాహ్నవి మృతిపై ఆఫీసర్ డానియల్ అడ్రూర్ జోక్గా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. క్రాస్వాక్ వద్ద జాహ్నవి రోడ్డు దాటుతున్న సమయంలో .. వేగంగా వచ్చిన పోలీసు కారు ఆమెను ఢీకొట్టింది. జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా, మరో చోటు నుంచి జాహ్నవి రోడ్డు క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.
వాహనం ఢీకొన్న తర్వాత ఆమెను హార్బర్వ్యూవ్ మెడికల్ సెంటర్కు తీసుకెళ్లారు. పోలీసు వాహనం అతివేగంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. కేవలం ఒక్క సెకను ముందు డ్రైవర్ డేవ్ బ్రేక్లు అప్లై చేశాడని, ఆ సమయంలో అతను 101 కిలోమీటర్ల వేగంతో ఉన్నాడని, బలంగా తాకడం వల్ల జాహ్నవి శరీరం 100 ఫీట్ల దూరంలో పడినట్లు రిపోర్టులో తెలిపారు.
జాహ్నవిని ఢీకొన్న ప్రాంతంలో స్పీడ్ లిమిట్ గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. కారు బాడీకామ్ వీడియోపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. జాహ్నవి మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.