న్యూయార్క్, నవంబర్ 18: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను ఆ సంస్థ నూతన అధిపతి ఎలాన్ మస్క్ తీవ్ర గందరగోళంలోకి నెట్టినట్టు కనిపిస్తున్నది. మస్క్ చర్యలతో విసిగిపోయిన చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కంపెనీ పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని, రోజుకు 12 గంటలు, వారానికి 80 గంటలకుపైగా పనిచేయాల్సి ఉంటుందని మస్క్ ఇటీవల ట్విట్టర్ ఉద్యోగులకు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ షరతులకు ఇష్టపడితే లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఉద్యోగాల్లో కొనసాగాలని, లేకపోతే కంపెనీ నుంచి వెళ్లిపోవాలని మస్క్ అల్టిమేటం జారీచేయడాన్నిట్విట్టర్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కంపెనీకి లిఖితపూర్వక హామీ ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనన్న భయంతో చాలా మంది ఉద్యోగాలను వీడి వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ట్విట్టర్లో కొనసాగడం లేదా వెళ్లిపోవడంపై గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తేల్చుకోవాలంటూ మస్క్ గడువు విధించడంతో వందలమంది ఉద్యోగులు 3 నెలల ‘సెవరెన్స్ పే’ తీసుకొని ఆ కంపెనీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకొన్నట్టు తెలుస్తున్నది. ఫలితంగా ట్విట్టర్ కార్యకలాపాలపై నీలి నీడలు అలుముకొని ఆ కంపెనీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగుల మూకుమ్మడి నిర్ణయం నేపథ్యంలో అప్రమత్తమైన ట్విట్టర్.. సోమవారం వరకూ కంపెనీ ఆఫీసులను మూసివేస్తున్నట్టు తెలిపింది.
మస్క్ ఓవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే, మరోవైపు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ట్విట్టర్ భవిష్యత్తు గురించి తానేమీ పెద్దగా ఆందోళన చెందడం లేదని, వందల మంది ఉద్యోగులు రాజీనామా చేసినప్పటికీ ఉత్తమ ఉద్యోగులెవరూ కంపెనీని వీడలేదని పేర్కొన్న మస్క్.. మరోవైపు ఉద్యోగులను బుజ్జగించేందుకు ఓ లేఖను రాసినట్టు తెలుస్తున్నది. లిఖితపూర్వక హామీలో భాగంగా ఉద్యోగులు సమర్పించాల్సిన ఫారంలో కొన్ని నిబంధనలను సడలించడంతోపాటు ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో పనితీరు బాగున్నదని మేనేజర్లు ధ్రువీకరించిన ఉద్యోగులకు కొన్ని మినహాయింపులు ఇస్తామన్నారు.