గాజా సిటీ, అక్టోబర్ 27: గాజాలో హమాస్ నిర్మించిన సొరంగాల నెట్వర్క్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ స్పాంజ్ బాంబులను వినియోగిస్తున్నది. వీటిని సొరంగాల్లో వేసినప్పుడు.. ఇందులోని రసాయనాలు కలిసి వెంటనే భారీగా నురగ విడుదల అవుతుంది. ఇది వేగంగా గడ్డకట్టి సొరంగం మూతపడుతుంది. గాజా భూగర్భంలో కొన్ని వేల కిలోమీటర్ల మేర టన్నెల్స్ నిర్మించారు. ఇజ్రాయెల్ సైన్యానికి ఇవి పెను సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో సొరంగాల నెట్వర్క్ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నది. సొరంగాలలో హమాస్ మిలిటెంట్లకు భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయి. వీటిని మూసివేయడం ద్వారా హమాస్కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.
కొనసాగుతున్న భూతల దాడులు
ఫైటర్ జెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం గాజాపై భూతల దాడులు నిర్వహించాయి. యుద్ధం కారణంగా పాలస్తీనాలో మరణాల సంఖ్య 7,300కు చేరుకుంది. గాజాలోని పలు భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని టాబాలో జరిగిన డ్రోన్ దాడి కారణంగా ఆరుగురు గాయపడ్డారని ఈజిప్ట్ సైన్యం తెలిపింది. యుద్ధ భయంతో గాజాలో 1.4 మిలియన్ల మంది ఇండ్లు వదిలి పారిపోయారు. వారిలో సగం మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు అమెరికా యుద్ధ విమానాలు ఉత్తర సిరియాపై దాడులు నిర్వహించాయి. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ అమెరికా సేనలపై దాడులు చేశాకే తాము ఈ దాడులు చేశామని పెంటగాన్ తెలిపింది.