టెల్ అవీవ్: ఇజ్రాయెల్ మహిళా బోర్డర్ పోలీస్ను పాలస్తీనా యువకుడు కత్తితో పొడిచి చంపాడు. (Israeli Woman Cop Stabbed To Death) అతడి దాడిలో మరో అధికారి కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు ఆ పాలస్తీనా యువకుడ్ని కాల్చి చంపారు. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఈ సంఘటన జరిగింది. అట్లాంటాకు చెందిన 20 ఏళ్ల ఎలిషేవా రోజ్ ఇడా లుబిన్ 2021లో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వచ్చింది. 2022లో ఇజ్రాయెల్ ఆర్మీలో చేరింది. సోమవారం జెరూసలేంలో నివసిస్తున్న 16 ఏళ్ల పాలస్తీనా యువకుడు బోర్డర్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పాలస్తీనా యువకుడి దాడిలో ఇజ్రాయెల్కు చెందిన మరో బోర్డర్ పోలీస్ అధికారి కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు ఆ యువకుడ్ని కాల్చి చంపారు.
కాగా, ఏళ్లుగా ఇజ్రాయెల్ దురాక్రమణ, దాడులపై పాలస్తీనా ప్రజలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో ఆధిపత్యమున్న హమాస్, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసింది. సుమారు 1500 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపిన హమాస్ ఉగ్రవాదులు వందల మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు.
మరోవైపు హమాస్ను అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై బాంబులు కురిపిస్తున్నది. ఇప్పటికే పది వేలకుపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. అయితే మానవతా సహాయం కోసం గాజాలో కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు హమాస్ ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నారు. హమాస్కు మద్దతిచ్చినట్లు అనుమానించిన పాలస్తీనా ప్రజలను అరెస్ట్ చేస్తున్నారు.