Israel Strikes : ఇజ్రాయెల్ (Israel), హెజ్బొల్లా (Hezbollah) మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) భీకర దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్ (South Lebanon), బెకా వ్యాలీ (Beka Vally) లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ వైమానిక దాడులు జరిగినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ దాడుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
గత 24 గంటల్లోనే సుమారు 50 లక్ష్యాలపై దాడి చేశామని ఐడీఎఫ్ శనివారం ప్రకటించింది. ఈ వారాంతంలో మొత్తం 70 సైనిక నిర్మాణాలు, 50 మౌలిక సదుపాయాల సైట్లతో కలిపి 120 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు మరో నివేదిక పేర్కొన్నది. హెజ్బొల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, ఆయుధాగారాలు, సైనిక భవనాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. తమ దేశ పౌరులు, సైనికులపై దాడులను అడ్డుకోవడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు స్పష్టంచేసింది. ఆదివారం ఉదయం కూడా దాడులు కొనసాగాయని పేర్కొన్నది.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పైకి రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది వరకు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, ఎంతమంది మిలిటెంట్లు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. దాడులకు ముందు పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. ఇరుపక్షాల దాడులు, ప్రతిదాడులతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.