జెరూసలేం, జనవరి 13: హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చెలరేగి ఆదివారంతో 100 రోజులు అయింది. గాజా భవిష్యత్తులో హమాస్ను లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రతినబూనగా.. అది భ్రమేనని హమాస్ అంటున్నది. ఇజ్రాయెల్ ఏర్పాటైన 1948 నుంచి ఇంత సుదీర్ఘకాల, విధ్వంసకర యుద్ధం ఇదే.
హమాస్ రాకెట్ దాడులపై తీవ్రస్థాయిలో స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం అనంతరం పెద్దయెత్తున బాంబు దాడులతో గాజా స్ట్రిప్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు 23 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ చెబుతున్నది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు కూడా దాదాపు 1200 మంది మరణించగా.. దాదాపు 250 మంది హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. 80 శాతం మంది గాజా జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
దిగ్బంధనంతో సంక్షోభ పరిస్థితులు
ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధనంతో గాజా ప్రజలు ఆహారం, తాగు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే గాజా నివాసయోగ్యం కానిదిగా మారిపోయిందని యూఎన్ మానవతా గ్రూప్ చీఫ్ మార్టిన్ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై కలవరం
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజేసింది. హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన హెజ్బొల్లా గ్రూపు కూడా ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ మద్దతు గల యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దాడులను ఆపాలని అమెరికా, మిత్రదేశాలు హౌతీలను హెచ్చరించాయి. వాటిని హౌతీలు పట్టించుకోకపోవడంతో అమెరికా, బ్రిటన్ శుక్రవారం యెమెన్లోని హౌతీ సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులకు దిగిన విషయం తెలిసిందే.