Israel attack : హమాస్ (Hamas) పై యుద్ధం పేరుతో గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడుతున్నది. రక్తపుటేరులు పారిస్తూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది. తాజాగా సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గత శుక్రవారం కూడా ఇజ్రాయెల్ సైన్యం ఖాన్ యూనిస్పై వైమానిక దాడి జరిపింది. గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే డాక్టర్ తన 10 మంది పిల్లలతోపాటు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో ఆ పిల్లల్లో తొమ్మిది మంది మృతిచెందారు. డాక్టర్ నజ్జర్తోపాటు ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నజ్జర్ తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం దక్షిణ గాజా సమీపంలోని నాజర్ దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆయన కడుపు, ఛాతీలో రక్త స్రావం అవుతున్నదని, దానిని నియంత్రించేందుకు రెండుసార్లు ఆపరేషన్లు జరిగాయని అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా అనే డాక్టర్ చెప్పారు. అతని తలకు కూడా తీవ్రగాయం అయిందని, ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఖాన్ యూనిస్పై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుంచి పౌరులను తరలించినట్లు పేర్కొంది.
2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు ఈ పోరులో 53 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. వారిలో 16,500 మందికిపైగా చిన్నారులే ఉన్నారు. హమాస్ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడమేగాక, వారి వద్ద బందీలుగా ఉన్న 53 మంది తమ దేశ పౌరులను విడిపించేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిజ్ఞ బూనింది.
అంతేకాక గత రెండున్నర నెలల నుంచి గాజాకు ఆహారం, మందులు, చమురు సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. దాంతో అక్కడి పౌరులు ఆకలితో అల్లాడుతున్నారు. ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు మానవతా సాయాన్ని పాక్షికంగా ఇజ్రాయెల్ పునరుద్ధరించింది.