డమాస్కస్: ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై (Syria) బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వైమానిక దాడులు చేసింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ (Damascus) బాంబుల మోతతో దద్దరిల్లింది. రాజధాని సమీపంలో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడిచేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్ తెలిపింది.
సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతున్నది. దీనిని అదనుగా చేసుకున్న ఇజ్రాయెల్.. సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ఇరాన్ మద్దతుతో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బలగాలు, లెబనాన్కు చెందిన హిజబుల్లా గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది. దీంతో ఇప్పటివరకు తమ దేశంలో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియా ఆరోపిస్తున్నది. లక్షల కొద్ది మంది దేశం విడిచిపోయారని తెలిపింది.