న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో గురుద్వారా లక్ష్యంగా బాంబు దాడి జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ దేశంలోని సిక్కులు, హిందువులు భారత్ వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులోభాగంగా వారికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఈ-వీసాలను మంజూరుచేస్తున్నది. ఇప్పటివరకు వంద మంది సిక్కులు, హిందువులను వీసాలను జారీచేశామని హోంశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కాగా, గురుద్వారాపై దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ (ISIS) ఉగ్రవాదులు ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతిగా ఈ దాడి జరిపినట్లు వెల్లడించారు.
శనివారం కాబూల్లోని సిక్కు గురుద్వారా లక్ష్యంగా భారీ దాడి జరిగింది. పలు పేలుళ్లు సంభవించడమే కాకుండా కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. తొలుత పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం గురుద్వారా వద్దకు వస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వరుసగా పలు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల సమయంలో గురుద్వారాలో 30 మంది ఉన్నారని, వారిలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.