Isfahan : ఇరాన్ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇస్ఫహాన్లోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలాచోట్ల భారీ ఎత్తున నల్లపొగ ఆకాశాన్ని కమ్మేసింది. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అదేవిధంగా పశ్చిమ టెహ్రాన్లోని ఇరాన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్పై కూడా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ తనకు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని అక్కడి నుంచే సేకరిస్తుంది. ఇదిలావుంటే ఇరాన్పై దాడులకు అమెరికా తన వద్ద ఉన్న బి-52 బాంబర్ విమానాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆదివారం ఉదయం దాదాపు 20 నిమిషాల వ్యవధిలోనే 20 భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా నగరంలోని ఎయిర్పోర్టు వద్ద ఇవి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.