న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్(ఐఎస్-కే) అనేది ఐసిస్ అనుబంధ సంస్థ. ఉత్తర, ఈశాన్య అఫ్గానిస్థాన్, దక్షిణ తుర్కెమెనిస్థాన్, ఇరాన్లో కొంత భాగాన్ని గతంలో ఖోరసాన్గా పిలిచేవారు. అక్కడ స్థాపించిన కారణంగా ఈ ఉగ్రసంస్థకు ఐఎస్-కే అని పేరు వచ్చింది. 2015 జనవరిలో దీనిని స్థాపించారు. అఫ్గాన్ తాలిబన్లు, పాకిస్తాన్ తాలిబన్లు కలిసి దీనిని ప్రారంభించారు. 2018 తర్వాత తాలిబన్ల దాడులతో ప్రాభవం కోల్పోయింది. ఐఎస్-కే, తాలిబన్లకు మధ్య సారూపత్యలు ఉన్నాయి. వైరుధ్యాలు ఉన్నాయి. రెండు గ్రూపులు సున్నీ తెగకే చెందినవి కావడం అతి ముఖ్యమైన సారూప్యత. కాగా, రెండు గ్రూపుల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయి. అందుకే తాలిబన్లు అఫ్గాన్ను అక్రమించుకొన్నప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ వారికి వ్యతిరేక ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.
అమెరికా తొత్తులు
కాబూల్ను ఆక్రమించుకొన్న రోజే తాలిబన్లను ‘అమెరికా తొత్తులు’ అని ఐసిస్ ఘాటుగా విమర్శించింది. అమెరికా, తాలిబన్లు ఇద్దరూ తోడు దొంగలని అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాలిబన్లు ఇస్లాంను భ్రష్టు పట్టిస్తున్నారని, అఫ్గానిస్థాన్లో జిహాద్ను అణగదొక్కడానికి అమెరికా రచించిన ప్రణాళికలను రహస్యంగా అమలు చేస్తున్నారని ఆరోపించింది. ఐసిస్ ప్రపంచవ్యాపంగా ఖలీఫా రాజ్యం రావాలని పోరాటం చేస్తుంటే, తాలిబన్లు అఫ్గాన్ సరిహద్దుల్లోపల అధికారం కోసం మతానికి ద్రోహం చేస్తున్నారన్నది.
మధ్యవర్థి హక్కానీ
ఐఎస్-కే, తాలిబన్ల మధ్య ఇటీవల సంబంధాలు మెరుగుపడుతున్నట్టు కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరి మధ్య హక్కానీ నెట్వర్క్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నట్టు అనుమానిస్తు న్నాయి. తాలిబన్లకు హక్కా నీ నెట్వర్క్కు సంబంధాలున్నాయి. హక్కానీ నెట్వర్క్, ఐఎస్-కే మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఐఎస్-కేకు సాంకేతిక సహకారం మొత్తం హక్కానీ నెట్వర్క్ నుంచే అందుతున్నది.