బాగ్దాద్, నవంబర్ 7: ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-కదిమిపై హత్యాయత్నం జరిగింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్న రెండు డ్రోన్లు బాగ్దాద్లోని ఆయన నివాసంపై ఆదివారం దాడి చేశాయి. తృటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ముస్తాఫా నివాసం సమీపంలోనే పలు రాయబార, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ప్రధాని లక్ష్యంగా డ్రోన్ దాడి జరుగడం చర్చనీయాంశమైంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ‘దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డా’ అని ముస్తాఫా ట్విట్టర్లో పేర్కొన్నారు.