Donald Trump : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని పేర్కొన్నారు. ఒక కన్జర్వేటివ్ బ్రాడ్కాస్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.
“ఆయన బతికే ఉన్నప్పటికీ చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరం ఎడమవైపు భాగం, చేయి, కాలు మొత్తం దెబ్బతిన్నాయి” అని ట్రంప్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలకు ఆయన ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఇరాన్ అధికారులు ఇప్పటికీ నిర్ణయాల కోసం ఖమేనీని సంప్రదిస్తున్నారని, ఇది ఆయన బతికే ఉన్నారనడానికి నిదర్శనమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా సైనిక చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే ఇరాన్కు చెందిన 22 బోట్లను ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు.
“మా నేవీ, సైన్యం అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ యుద్ధంలో త్వరలోనే మేం పెద్ద విజయం సాధించబోతున్నాం” అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు చేయడం లేదని అడుగగా.. అక్కడ నిరసనకారులపై కాల్పులు జరపడానికి సైన్యం, స్నిఫర్లు సిద్ధంగా ఉన్నారని, అందుకే వారు బయటకు రావడం లేదని బదులిచ్చారు. ఇరాన్ నావికాదళం, వాయుసేన పూర్తిగా నాశనమయ్యాయని, ఆ దేశం చాలా బలహీనపడిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ను అణ్వాయుధం దక్కించుకోకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టంచేశారు. 2015 నాటి అణు ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు.