Iran : తమ దేశానికి చెందిన ప్రముఖ నేతను అవమానించేలా కార్టూన్ వేసినందుకు ఫ్రాన్స్ను ఇరాన్ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఇరుదేశాల మధ్య వివాదానికి ఫ్రాన్స్కు చెందిన చార్లీ హెబ్డే అనే వ్యంగ్య మ్యాగజైన్ కేంద్ర బిందువు అయింది. ఈ మ్యాగజైన్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమనీను అవమానించేలా కార్టూన్ ముద్రించింది. అలాంటి కార్టూన్లు దాదాపు 12కు పైగా వచ్చాయి. అయితే.. గత కొన్ని నెలలుగా ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా డిసెంబర్ నెలలో నిర్వహించిన పోటీల్లో భాగంగానే ఈ కార్టూన్లు ప్రింట్ చేశామని మ్యాగజైన్ తెలిపింది.
‘భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ముస్లిం దేశాల పవిత్రతను అవమానపరిచేందుకు ఫ్రాన్స్కు ఎలాంటి అధికారం లేదు’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నసీర్ కన్సాయ్ అన్నాడు. అయితే.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఫ్రాన్స్ రాయబారిని ఇరాన్ ఆదేశించింది. చార్లీ హెబ్దో 2015లో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్ను ముద్రించింది. దాంతో, ప్రవక్తను అవమానించారనే కారణంతో ప్యారిస్లోని ఈ సంస్థ ఆఫీసుపై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో 12 మంది చనిపోయారు.
హిజబ్ సరిగా ధరించలేదనే కారణంతో మహ్సా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయిని పోయిన ఏడాది సెప్టెంబర్లో మోరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వాళ్లు బాగా కొట్టడంతో చనిపోయింది. దాంతో, ఇరాన్లో హిజబ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. వేలసంఖ్యలో జనం రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపారు. ఇప్పటివరకు ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతోంది.