US vs Iran : పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితులు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్ (Iran) పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా (USA) సన్నద్ధమవుతుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ సిబ్బందికి నోటమ్ జారీచేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఈ నోటమ్ జారీచేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశముంది.
అదే సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే.. టెహ్రాన్పై మళ్లీ దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసివేయడంతో.. పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.