టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు(Iran President) ఇబ్రహీం రైసీ .. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం 9 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దేశాధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే, మరి ఆ అధ్యక్ష స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరినైనా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటిస్తారా లేక హుటాహుటిన ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ఒకవేళ దేశాధ్యక్షుడు మరణిస్తే, ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడి .. దేశాధ్యక్ష బాధ్యతలు సత్వరం చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సుప్రీ నేత ఆమోదం దక్కాల్సి ఉంటుంది. సుప్రీం నేత ఆమోదం తర్వాత అధ్యక్షుడికి అధికారాలు, బాధ్యతలను అప్పగిస్తారు.
ప్రస్తుతం తొలి ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బీర్ ఉన్నారు. రైసీ మరణాన్ని ద్రువీకరించారు కాబట్టి, ఆయన స్థానంలో మొఖ్బీర్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇరాన్ సుప్రీం నేత అయోతుల్లా అలీ ఖమేనీ ఆమోదం తెలుపాకే ఈ అధికార మార్పిడి జరుగుతుంది. అయితే రైసీ హెలికాప్టర్ జరిగిన ప్రమాద స్థలానకి మొఖ్బీర్ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సర్కారులో మూడు శాఖలు కీలకమైనవి. దేశ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్, న్యాయ వ్యవస్థ అధిపతి.. ఈ ముగ్గురూ ముఖ్యమైనవాళ్లు. ఈ ముగ్గురు అనుమతితోనే .. పాలనలో మార్పులు తేవాల్సి ఉంటుంది. అయితే రాబోయే 50 రోజుల్లో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉపాధ్యక్షుడే.. తాత్కాలి అధ్యక్షుడి పాత్రను పోషిస్తారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్లో.. సుప్రీం లీడరే అతి కీలకం. దేశీయ, విదేశీయ వ్యవహారాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలే ముఖ్యం. దేశాధ్యక్షుడి కన్నా.. అధికారాలన్నీ సుప్రీం నేత ఆధీనంలోనే ఉంటాయి. మాజీ అధ్యక్షుడు హసన్ రౌహనీ, సుప్రీం నేత ఖమోనీ మధ్య గతంలో సరైన సంబంధాలు ఉండేవికాదు. కానీ అధ్యక్షుడు రైసీ మాత్రం ఖమేనీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రైసీని సుప్రీం నేతగా తీర్చిదిద్దాలని ఖమోనీ ప్రయత్నిస్తున్నట్లు ఇరానియన్లు భావిస్తున్నారు.