Iran vs US : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా (USA) జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ (Iran) కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సంచలన చర్యకు దిగింది. కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బలగాలు ఆదివారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక పరిణామంతో ఆ ప్రాంతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా పక్కకుపోయి, ఉభయ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న తమ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ గిడ్డంగులు, తీరప్రాంత రాడార్ స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు సమాధానంగానే తాము ఈ సైనిక చర్య చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకోగా.. బహ్రెయిన్లోని అమెరికా సైనిక కేంద్రాల పరిసరాల్లో భారీ అలజడి రేగింది. ఈ దాడులవల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఈ దాడుల అనంతరం ఇరాన్ నావికాదళం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ‘నరకాన్ని చూస్తాయని’ వ్యాఖ్యానించింది. అమెరికాయే మొదట శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలను పాటించని నౌకలపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇరాన్ గనుక ఇలాగే ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పోతే వాషింగ్టన్ సైనికపరంగా ఈ కథను ముగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
అలాంటి పరిస్థితి వస్తే ప్రపంచ పటంలో ‘ఇరాన్ అనే దేశమే ఇకపై ఉనికిలో ఉండదు’ అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ‘కికు’ అనే అంతర్జాతీయ చమురు నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతిచర్యగా అమెరికా సైన్యం దాడులు ప్రారంభించింది. అమెరికా వరుసగా రెండోరోజు కూడా ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేయడంతో ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది.