Pakistan Ship : ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటేందుకు యత్నించిన పాకిస్థాన్ నౌక (Pakistan Ship) ను ఇరాన్ (Iran) వెనక్కి పంపించింది. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాక్ కంటైనర్ షిప్ను ఇరాన్ వెనక్కి పంపింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి చేసింది.
ఈ క్రమంలో హర్మూజ్ మీదుగా పాకిస్థాన్కు చెందిన కంటైనర్ కరాచీకి వెళ్తోంది. అయితే అనుమతులు లేకుండా వెళ్తున్న ఆ నౌకను వెనక్కి రప్పించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (IRGC) వెల్లడించింది. హర్మూజ్ గుండా వెళ్లే ప్రతి నౌక ఐఆర్జీసీ సముద్ర అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.
పాకిస్థాన్కు చెందిన నౌకను ఇరాన్ వెనక్కి రప్పించినట్లు కాబుల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా నుంచి ఈ నౌక కరాచీకి వెళ్తుండగా ఇరాన్ అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ జలసంధి గుండా తాము అనుమతించిన నౌకలు వెళ్లాలని చెబుతోంది.