ఫ్యాన్స్ స్పృహ తప్పిపడిపోవడంతో కొరియా పాప్ బ్యాండ్ ఎన్సీటీ 127 ఇండోనేషియాలో తమ షోను అర్థాంతరంగా నిలిపేసింది. ఇండోనేషియాలో వీళ్ల బ్యాండ్ మొదటి ప్రదర్శన కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాజధాని జకర్తాలో రాత్రి 7 గంటలకు షో మొదలైంది. రెండు గంటల పాటు పాప్ గీతాలు, ఫ్యాన్స్ ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే, ఆ టైంలోనే కొందరు తమ అభిమాన సింగర్లను చూడ్డానికి స్టేజీకి దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అందరూ తోసుకొని రావడంతో స్టేజీ దగ్గర ఏర్పాటు చేసిన భారీకేడ్లు కిందపడ్డాయి. దాంతో అదుపుతప్పి ఫ్యాన్స్ ఒకరిమీద ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 30 మంది వరకు స్పృహ తప్పి కింద పడిపోయారు. దాంతో, మరింత మందికి ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు షోని ఆపి వేయాలనుకున్నారు నిర్వాహకులు. ఈ విషయం తెలిసిన వెంటనే షోని నిలిపివేసింది పాప్ బ్యాండ్.
చెప్పినా వినకపోవడం వల్లనే
‘కొందరు ఫ్యాన్స్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. వాళ్ల తీరుపట్ల మా బ్యాండ్ చాలా నిరాశ చెందాం. ఒకరినొకరు తోసుకోవద్దని ఫ్యాన్స్కి పదే పదే మేము చెప్తూనే ఉన్నాం. అయినా కూడా వాళ్లు మా బ్యాండ్ని దగ్గరి నుంచి వీడియో తీయాలనుకున్నారు. ఈ క్రమంలో అవతలివాళ్ల భద్రతను వాళ్లు పట్టించుకోలేదు’ అని చెప్పింది బ్యాండ్లో ఒకరైన సిఫా ఆలియా.
స్టేడియం ప్రమాదం మరవక ముందే
పాప్ బ్యాండ్ ప్రదర్శన టైంలో తొక్కిసలాట జరగడంతో అందరికీ ఈ మధ్యే జరిగిన ఫుట్బాల్ స్టేడియం ప్రమాదం గుర్తుకొచ్చింది. అక్టోబర్ నెలలో ఇండోనేషియాలోని ఒక ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 130 మందికి పైగా చనిపోయారు. వీళ్లలో 40 మంది పిల్లలు ఉన్నారు. వందల మంది ప్రాణాలు విడిచిన ఆ స్టేడియంని ఇండోనేషియా ప్రభుత్వం కూల్చేసింది.