Military Drill | చైనా సరిహద్దుల్లో ఇండో-అమెరికా సైనికులు విన్యాసాలు చేయనున్నారు. వచ్చే నెల 8 నుంచి మూడు రోజుల పాటు ఈ ఉమ్మడి విన్యాసాలు కొనసాగుతాయి. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సైనిక విన్యాసాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు దేశాలు మూడు ప్రధాన విన్యాసాలను ప్రదర్శించేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సైనిక విన్యాసాల్లో భారత్కు తన సైనిక బలాన్ని ప్రదర్శించే అవకాశం చిక్కింది.
ఉత్తరాఖండ్లోని ఔలిలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు జరుగనున్నాయి. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) కి 100 కిలీమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి దాదాపు 350-350 మంది సైనికులు పాల్గొంటారని ఓ అధికారి తెలిపారు. సమీకృత యుద్ధ బృందాలు పర్వతాలు, అతి శీతల ప్రాంతాల్లో ఎలా పనిచేస్తారనే విషయాన్ని పరీక్షిస్తారు. ఈ కసరత్తు మన దేశంలో ఒక ఏడాది, అమెరికాలో మరో ఏడాది జరుగుతుంది. గతేడాది అమెరికాలోని అలాస్కాలో ఈ విన్యాసాలు జరిగాయి.
ఇండో-యుఎస్ సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్ సమీపంలో ఉన్న చైనా సరిహద్దులోని భారత సైన్యం సెంట్రల్ సెక్టార్లో జరుపుతున్నారు. ఈ ప్రాంతం విషయంలో భారత్-చైనాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్నది. రెండేండ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల అనంతరం ఈ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగాయి. ఈ కారణంగానే ఇండో-అమెరికా సైనిక విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది.