న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షాపై మాఫియా ఆరోపణలు వచ్చాయి. గ్యాంబ్లింగ్ ఆపరేషన్(Gambling Operation) నడిపిస్తున్నట్లు అతనిపై అభియోగాలు నమోదు అయ్యాయి. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆ ఆరోపణలు చేశారు. మాఫియా తరహా గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆనంద్ షా .. రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్న తేలింది. అభియోగాలు నమోదు అయిన 39 మందిలో అతను ఉన్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ అభియోగాలు నమోదు చేశారు. మొత్తం 4 పోకర్ క్లబ్లపై దాడులు జరిగాయి.
ఫ్లోరిడాకు చెందిన మరో భారత సంతతి వ్యక్తి సమిర్ ఎస్ నందకర్ని పై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. పోకర్ హోస్ట్ అని అతనిపై కేసు బుక్ చేశారు. న్యూజెర్సీలో ఆనంద్ షా ఓ కీలక రాజకీయవేత్తగా ఎదుగుతున్నారు. న్యూయార్క్ శివారు ప్రాంతం ప్రాస్పెక్ట్ పార్క్లో అతను మున్సిపల్ కౌన్సిలర్గా రెండో సారి చేస్తున్నాడు. ఫైనాన్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్సూరెన్స్ ఇంచార్జీగా ఉన్నాడతను. కౌన్సిల్ సభ్యుడిని అరెస్టు చేయడం అంటే ప్రజల్లో ఎన్నికైన వ్యక్తులపై విశ్వాసాన్ని కోల్పోవడమే అవుతుందని అటార్నీ తెలిపారు.
స్పోర్ట్స్బుక్ గ్యాంబ్లింగ్ పేరుతో స్పోర్ట్స్ టోర్నీలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు మూడు మిలియన్ల డాలర్ల గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. సినిమాలు, టీవీల్లో మాఫియాను రొమాంటిక్గా చూపిస్తారని, కానీ వాస్తవంలో అది చట్టాలను బ్రేక్ చేయడమే అవుతుందని, డబ్బు.. కంట్రోల్, హింసకు దారి తీస్తుందని అటార్నీ తెలిపారు.