సివిరొడోనెస్కీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ .. ఉక్రెయిన్లో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆయన వద్ద బ్లాక్ ప్యాంథర్, జాగ్వార్ పులులు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైన తర్వాత.. డాక్టర్ గిరికుమార్ తన ఇంట్లోని బేస్మెంట్కే పరిమితం అయ్యాడు. ఇక తన వద్ద ఉన్న రెండు పులులు కూడా ఆ బేస్మెంట్లోనే భయం భయంతో కాలం గడుపుతున్నాయి. 20 నెలల క్రితమే ఆ రెండు జంతువుల్ని కీవ్ జంతుశాల నుంచి కొనుగోలు చేశారు. రష్యా బాంబుల వర్షం కురిపించినా.. తాను మాత్రం తన పెట్స్ను వదిలేది లేదంటున్నారు. ఈస్ట్రన్ ఉక్రెయిన్లోని డోన్బాస్ ప్రాంతంలో ఉన్న సివిరొడోనెస్కీ గ్రామంలో.. ప్రస్తుతం డాక్టర్ గిరికుమార్ నివాసం ఉంటున్నారు. బాంబుల మోత నుంచి తప్పించుకునేందకు అతను తన ఇంటి బేస్మెంట్లోనే ఉంటున్నారు. పాంథర్, జాగ్వార్లకు ఆహారం తీసుకువచ్చేందుకు మాత్రమే బయటకు వెళ్తున్నట్లు గిరి తెలిపారు. అతని వద్ద ఉన్న ఆడ ప్యాంథర్ వయసు ఆరు నెలలు. ఇటీవలే ప్యాంథర్, జాగ్వార్ల కోసం 23 కిలోల గొర్రె, టర్కీ, చికెన్ మాంసాన్ని తీసుకువచ్చినట్లు చెప్పాడు. అది కూడా నాలుగు రెట్లు అధిక ధర చెల్లించినట్లు తెలిపారు.
తనతో పాటు తన వద్ద ఉన్న ఆ రెండు జంతువులు బేస్మెంట్లో ఉంటున్నట్లు అతను తెలిపారు. తమ చుట్టూ అనేక ప్రాంతాల్లో బాంబుల మోత కొనసాగుతోందని, ఆ శబ్ధాలకు పులులు భయపడుతున్నాయని, భయంతో చాలా తక్కువ ఆహారం తీసుకుంటున్నాయని, వాటిని వదిలి వెళ్లాలని తనకు లేదని డాక్టర్ గిరి తెలిపారు. రెండో సారి తాను యుద్ధ వాతావరణంలో ఉన్నానని, కానీ ఈ సారి యుద్ధం చాలా భయానకంగా సాగుతున్నట్లు చెప్పారు. గతంలో లుహన్స్కీ ప్రాంతంలో గిరి ఉండేవారు. అక్కడ రష్యా మద్దతుతో మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. 2014లో అక్కడ భీకర ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని వదలి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సివిర్డోనస్కీకి గిరి వలస వెళ్లారు. ప్రస్తుతం తాను వార్ జోన్లో ఉన్నానని, పేరెంట్స్ కాల్ చేస్తున్నారని, కానీ పులుల్ని వదిలి వెళ్లలేనన్నారు.
బ్లాక్ ప్యాంథర్ను సుమారు 35 వేల డాలర్లు పెట్టి కొన్నట్లు డాక్టర్ గిరి తెలిపారు. పెంచుకునేందుకు కావాల్సినంత స్థలం ఉంటే, అప్పుడు కీవ్ జూ వారికి జంతువుల్ని అమ్ముతుంది. ఆ రెండు జంతువులకు బర్త్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన డాక్టర్ గిరికుమార్.. 2007లో మెడిసిన్ చదివేందుకు ఉక్రేయిన్ వెళ్లారు. 2014 నుంచి ఆర్థోపెడిక్ ప్రాక్టీసింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సివిరిడోనెన్సీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆ ఊరిలో ఆరు రూమ్లు ఉన్న రెండు అంతస్తుల భవనంలో అతను ఉంటున్నారు. తన జీతాన్ని మొత్తం పెట్స్ కోసం ఖర్చు చేశారు. రెండు పులులతో పాటు మూడు జాగిలాలు కూడా అతని వద్ద ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ద్వారా అదనపు ఆదాయాన్ని అతను ఆర్జిస్తున్నారు. యూట్యూబ్లోకి అతనికి 85వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
జంతు ప్రేమికుడైన డాక్టర్ గిరికుమార్.. తెలుగులోనూ కొన్ని షోలను చేశారు. ఉక్రెయిన్ స్థానిక చిత్రాల్లో విదేశీయుడి తరహాలో పాత్రలు పోషించినట్లు చెప్పారు. తన ఇంటి నుంచి రష్యా బోర్డర్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అక్కడ ప్రస్తుతం పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అయినా తాను మాత్రం సోసల్ మీడియాలో వరుసగా వీడియోలు పోస్టు చేస్తున్నట్లు చెప్పారు. పెంపుడు జంతువుల్ని వదిలి.. ఎక్కడికి వెళ్లేదిలేదని డాక్టర్ గిరి తేల్చి చెబుతున్నారు.