అహ్మదాబాద్: అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ బోటు యాసీన్ను ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్ అంకిత్ గస్తీ విధుల్లో ఉండగా.. భారత జలాల్లో 6 నుంచి 7 మైళ్ల లోపల పాకిస్థాన్ బోటు యాసీన్ కనిపించింది. అంకిత్ షిప్ను చూడగానే వాళ్లు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ కోస్ట్గార్డ్ సిబ్బంది చేజ్ చేసి వాళ్లను పట్టుకున్నారు.
బోటును స్వాధీనం చేసుకుని, దానిలో ఉన్న 10 మంది పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఆ బోటులో ఉన్న 2000 కిలోల చేపలు, 600 లీటర్ల ఇంధనాన్ని సీజ్ చేశారు. బోటులోని సిబ్బంది దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, తదుపరి విచారణ కోసం వాళ్లను పోరుబందర్కు తరలించామని కోస్ట్గార్డ్ అధికారులు తెలిపారు. కాగా, పాకిస్థాన్ తరచూ సముద్ర మార్గం గుండా మాదకద్రవ్యాలను, ఉగ్రవాదులను అక్రమంగా భారత్లో చొరబెడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.