India summons : భారతీయ నౌకలపై అమెరికా వరుసగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. మన దేశంలోని అమెరికా రాయబారి జేసన్ మీక్స్కు నిరసన తెలుపుతూ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందించిన తర్వాత కూడా ఇండియన్ వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేసింది. దీంతో మరోసారి అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది.
48 గంటల వ్యవధిలోనే యూఎస్ రాయబారికి ఇండియా రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఎంబసీగా పని చేస్తున్న మీక్స్ను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి పిలిపించి, వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఎంటీ జల్వీర్ అనే భారత వాణిజ్య నౌకపై హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో షినాసో పోర్టు సమీపంలో గురువారం అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 20 మంది భారతీయులున్నారు. అంతకుముందు జూన్ 8న ఎంటీ మారివెక్స్ అనే నౌకపై కూడా అమెరికా దాడి చేసింది.
ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, 21 మందిని సహాయక సిబ్బందిని రక్షించారు. ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులను ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన చేసింది. కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాలా కూడా ఈ దాడుల్ని ఖండించారు. ఈ దాడుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు.