న్యూఢిల్లీ: చైనా యుద్ధ నౌకలకు ఇంధనాన్ని రహస్యంగా శ్రీలంక నింపుతున్నది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా నౌకలకు ఇంధనం నింపడం, డాకింగ్ కోసం శ్రీలంక పారదర్శక ప్రామాణిక ఆపరేషన్ విధానాలను (ఎస్వోపీ)లు రూపొందించాలని భారత్ గతంలో సూచించింది. అలాగే శ్రీలంక నుంచి చైనా లీజుకు తీసుకున్న హంబన్తోట నౌకాశ్రయం, కొలంబో పోర్ట్లలో చైనా యుద్ధ నౌకలను డాక్ చేయడానికి లేదా ఇంధనం నింపుకోవడానికి అనుమతించవద్దని కోరింది.
అయితే భారత్ విన్నపాన్ని శ్రీలంక లెక్కచేయడం లేదు. సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక ట్యాంకర్లు రహస్యంగా ఇంధనం నింపుతున్నాయి. చైనా లీజ్కు తీసుకున్న హంబన్తోట నౌకాశ్రయం నుంచి ఇంధనాన్ని శ్రీలంక ట్యాంకర్లలో లోడ్ చేస్తున్నాయి. సముద్రంలో ఉన్న చైనా యుద్ధ నౌకలకు రహస్యంగా ఇంధనం నింపుతున్నాయి. ఈ విషయం భారత్ దృష్టికి రావడంతో శ్రీలంక తీరుపై కన్నెర్ర జేసింది.
కాగా, చైనాకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ వాంగ్ యువాన్ 5ను హంబన్తోట పోర్ట్ వద్ద డాక్ చేయడానికి రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. దీనిపై భారత్, అమెరికా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా యుద్ధ, వ్యూహాత్మక నిఘా నౌకలను శ్రీలంక నౌకాశ్రయాలలో డాకింగ్ చేయడానికి అనుమతించవద్దని ఈ రెండు దేశాలు స్పష్టంగా చెప్పాయి. దీంతో తమ నౌకాశ్రయాల్లోకి చైనా యుద్ధ నౌకలను శ్రీలంక అనుమతించడం లేదు. అయితే సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న చైనా యుద్ధ నౌకలకు ట్యాంకర్ల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేసి రహస్యంగా శ్రీలంక నింపుతున్నది.