ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించడంతో వివాదం ముదిరిపోయింది. రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. దేశ గగన తలాన్ని మూసేసింది. దీంతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి బయల్దేరిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది. దీంతో అక్కడి భారతీయులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇతర మార్గాలను అన్వేషించే పనిలోనే నిమగ్నమయ్యామని ప్రకటించారు.
భారతీయుల కోసం ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులోనే వుంటుందని, భారత రాయబార కార్యాలయం ఇచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటిస్తే సరిపోతుందని భారత ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసేయడంతో ప్రత్యేక విమానాలు రద్దయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి ఎంబసీ స్పష్టం చేసింది. వాటిపైనే చర్చలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి రాగానే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. భారతీయులందరూ పశ్చిమ ఉక్రెయిన్ వైపు వెళ్లిపోవాలని సూచించారు. ఈ సమయంలో పాస్పోర్టులతో పాటు అత్యవసరమైన డాక్యుమెంట్లను కూడా తమ దగ్గర ఉంచుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ఉక్రెయిన్లోని పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. దయచేసి సహనంతో ఉండండి. ఎక్కడి వారు అక్కడే ఉండిపోండి. మీ మీ ఇళ్లల్లోనే తలదాల్చుకోండి.’ అంటూ భారత విదేశాంగ శాఖ అక్కడి వారికి సూచించింది.