Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తమ దేశ సైనికులు, నాటో దళాలకు మంగళవారం క్రిస్మస్ విందు వడ్డించారు. అంతేకాదు వాళ్లతో కాసేపు ముచ్చటించారు. రిషి ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. ఎస్తోనియాలో ఆయన బాల్టిక్, స్కాండినేవియన్ యూనియన్ ప్రతినిధులను కలిశారు. తాపా సైనిక కేంద్రంలో నాటో, తమ దేశ సైనికులకు క్రిస్మస్ డిన్నర్ వడ్డించారు. ‘ఈ ఏడాది మన ఖండంలో ఒక పూర్తి స్థాయి యుద్ధాన్ని చూశాం. అయితే.. లండన్తో పాటు సభ్య దేశాలను కాపాడేందుకు సైనిక దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలను చూసి నేను చాలా గర్విస్తున్నా’ అని రిషి సునాక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సైనికుల అంకితభావాన్ని, వాళ్ల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్పై సైనిక దాడికి దిగింది. ఆ రోజు నుంచి దాంతో, ఉక్రెయిన్కు బ్రిటన్తో పాటు నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేశాయి. అంతేకాదు ఎస్తోనియాలో సైన్యం సంఖ్యను బ్రిటన్ రెండింతలు చేసింది. ఆపరేషన్ కాబ్రిట్లో భాగంగా ఎస్తోనియా , పోలాండ్లో వెయ్యికి పైగా సైనికులను బ్రిటన్ మోహరించింది. నార్డిక్ బాల్టిక్ బృందంలో 8 దేశాలు ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఐస్లాండ్, లాథ్వియా, లుథివానియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి సునాక్ అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా గుర్తింపు సాధించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని ఒడ్డున పడేసేందుకు చర్యలు చేపట్టారు.