Imran Khan | ఇస్లామాబాద్, ఏప్రిల్ 1: తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఇమ్రాన్కు, ఆయన భార్య బుస్రా బీబీకి విధించిన 14 ఏండ్ల జైలు శిక్షను హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ దంపతులిద్దరికీ ఈ ఏడాది జనవరి 31న 14 ఏండ్ల చొప్పున జైలు శిక్ష విధించడంతో వారు శిక్ష అనుభవిస్తున్నారు. తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమీర్ ఫరూక్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం వారికి తాత్కాలిక ఊరట కలిగించింది.
వారిద్దరికీ విధించిన శిక్షను రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే శిక్షకు వ్యతిరేకంగా వారు దాఖలు చేసిన పిటిషన్లను ఈద్ పండుగ తర్వాత వచ్చే నెల విచారిస్తామని తెలిపింది. కాగా, శిక్ష రద్దు చేసినా ఇమ్రాన్ దంపతులిద్దరూ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇమ్రాన్, బుస్రా కూడా వేరే కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.