ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నారు. నటుడు, మోడల్ మిర్జా బిలాల్ బేగ్ను మూడో పెండ్లి చేసుకున్నట్లు రేహమ్ ఖాన్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మిర్జా బిలాల్ తల్లిదండ్రులు, తన కుమారుడి సమక్షంలో తమ వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తన తరఫున తన కొడుకే పెండ్లి పెద్దగా ఉన్నాడని చెప్పారు.
ఎట్టకేలకు తనకు బాగా నమ్మకమైన వ్యక్తే భర్తగా వచ్చాడని రేహమ్ ఖాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, మిర్జా బిలాల్కు కూడా ఇది మూడో వివాహం కావడం గమనార్హం. రేహమ్ ఖాన్ 1973లో లిబియాలోని అజ్డబియాలో జన్మించారు. ఆ తర్వాత పాకిస్థాన్లో విద్యాభ్యాసం చేశారు. 1990ల్లో బ్రిటన్లో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్గా కెరీర్ను మొదలుపెట్టారు.
2012లో మళ్లీ పాకిస్థాన్కు వెళ్లి ఓ టీవీ ఛానెల్లో జర్నలిస్టుగా చేరారు. ఆ ఛానెల్ తరఫున ఇమ్రాన్ ఖాన్ను కలిసి ఇంటర్వ్యూ చేశారు. దాంతో వారి మధ్య పరిచయం ఏర్పడి క్రమంగా బలపడింది. ఈ క్రమంలోనే 2015లో ఇమ్రాన్ ఖాన్, రేహమ్ ఖాన్ పెండ్లి చేసుకున్నారు. అయితే, ఖాన్ మొదటి భార్య వారి వివాహ బంధంపై చెడుగా ప్రచారం చేయడంతో 10 నెలలకే విడిపోయారు.
ఇప్పుడు మిర్జా బిలాల్ను మూడో పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రేహమ్ ఖాన్ వయసు 49 సంవత్సరాలు కాగా, మిర్జా బిలాల్ వయసు 36 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య 13 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. కాగా, రేహమ్ ఖాన్తో విడిపోయిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ కూడా మూడో పెండ్లి చేసుకున్నారు. 2018లోనే ఇమ్రాన్ మూడో వివాహం జరిగింది.