Pak PM Imran Khan | ప్రజలు వీధి ప్రదర్శనలకు దిగాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కోరారు. ఆదివారం నాడు ఇమ్రాన్ఖాన్ సర్కార్కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నది. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వ అధికారిక టీవీ చానెల్ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడారు. ఒకవేళ ఇటువంటి ఘటనలు మరే దేశంలోనైనా జరిగితే ప్రజలు వీధుల్లోకి వస్తారు. మీ అందరికీ పిలుపునిస్తున్నా.. ఈ రోజు, రేపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపాలని కోరుతున్నా. జాతి ప్రయోజనాల రీత్యా మీరు మీ అంతరాత్మ ప్రబోధం మేరకు పని చేయండి అని ఇమ్రాన్ఖాన్ పిలుపునిచ్చారు.
అవిశ్వాసానికే మెజారిటీ సభ్యుల మద్దతు
విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుగా రాజీనామా చేయాలని విపక్షాలు కోరుతున్నా ఇమ్రాన్ఖాన్ అందుకు ససేమిరా అంటున్నారు. చివరి బంతి వరకు ఆడతానని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం అవిశ్వాస ఓటుతో తనను బయటకు పంపేయడాన్ని ఆమోదించబోనని ఇమ్రాన్ఖాన్ అన్నట్లు తెలుస్తున్నది.
విదేశీ కుట్రపై ఇమ్రాన్ పునరుద్ఘాటన
కొంత మంది ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఇమ్రాన్ఖాన్ మాట్లాడుతూ తనను ప్రధానిగా తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతుందని మరోసారి పునరుద్ఘాటించారు. విదేశీ కుట్రదారుల ఎత్తులకు అనుగుణంగా పాకిస్థాన్ రాజకీయ నాయకులు గొర్రెల్లా తలూపుతున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుట్ర దారుల ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
మైనారిటీలో ఇమ్రాన్ఖాన్ సర్కార్
ఇమ్రాన్ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షాలుగా ఉన్న బెలూచిస్తాన్ అవామీ పార్టీ, ముత్తాహిద ఖ్వామి మూవ్మెంట్ (పాకిస్థాన్) పార్టీలు విపక్షాలకు మద్దతు తెలిపాయి. దీంతో ఇమ్రాన్ఖాన్ సర్కార్ మైనారిటీలో పడింది.
అలాగైతే షాహబాజ్ షరీఫ్ ప్రధాని?
ఒకవేళ ఇమ్రాన్ఖాన్ అవిశ్వాస తీర్మానంపై ఓడిపోతే పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ షరీఫ్ (పీఎంఎల్-ఎన్) అధినేత షాహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అవుతారని సమాచారం. 342 మంది సభ్యులు గల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్కు 172 మంది ఎంపీల మద్దతు కావాలి. తనకు 177 మంది ఎంపీల మద్దతు ఉందని ఇమ్రాన్ఖాన్ చెబుతున్నారు.
విశ్వాస పరీక్షను ఎదుర్కోంటున్న ప్రధానుల్లో మూడో వ్యక్తి
పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధానుల్లో ఇమ్రాన్ఖాన్ మూడో వ్యక్తి అవుతారు. ఇంతకుముందు బెనజీర్ భుట్టో, షౌకత్ అజీజ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ఖాన్ కీలకమైన మిలిటరీ మద్దతు కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా పాక్ రాజకీయ అధికారంలో ఆర్మీ కీలకంగా వ్యవహరిస్తున్నది.