పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ప్రధానంగా రెండు కేసులు ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ రెండు కేసుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ అక్రమంగా డబ్బు కూడగట్టారనేది ప్రధాన ఆరోపణ. ఆ రెండు కేసుల్లో ఒకటి అల్ ఖదిర్ ట్రస్టు కేసు కాగా మరోకటి తోషఖానా కేసు. అసలు ఈ కేసుల వివాదాలేంటి అనే విషయాలు చూసినట్లైతే..
అల్ ఖదీర్ ట్రస్టు కేసు
ఈ కేసుకు సంబంధించి దేశ ఖాజానాకు రూ.5వేల కోట్లు నష్టం వాటిల్లందనే ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అల్ ఖదీర్ ట్రస్ట్ ఏర్పాటు ముసుగులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే అరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వ ఆరోపణల ప్రకారం.. పాకిస్థాన్ పంజాబ్లోని జీలం జిల్లాలో సూఫీయిజం బోధించేందుకు అల్ ఖదీర్ యూనివర్సిటీ నిర్మించేందుకు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, కొద్ది మంది సన్నిహితులతో అల్ ఖదీర్ ట్రస్టు ఏర్పాటు చేశారు.
2019లో ఇమ్రాన్ ఖాన్ భార్య బహ్రియా పట్టణానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ట్రస్ట్కు దాదాపు 57 ఎకరాల భూమిని ఆ సంస్థ విరాళంగా ఇచ్చింది. ఆ భూమిలో 30 ఎకరాల భూమిని బుష్రా బీబీ తన ఫ్రెండ్ పేరు మీద బదలాయించింది.
బహ్రియా పట్టణంలో రియల్ ఎస్టేట్ అధిపతి అయిన మాలిక్ రియాజ్ నుంచి బ్రిటన్లో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఏకంగా 19కోట్ల పౌండ్ల (పాకిస్థాన్ కరెన్సీలో రూ.5000కోట్లు) బ్లాక్మనీని జప్తు చేసింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఇతర దేశాలకు చెందిన వ్యక్తి డబ్బుల్ని స్వాధీనం చేసినట్లైతే ఆ డబ్బును తిరిగి వ్యక్తి సొంత దేశ ప్రభుత్వానికి అప్పగించాలి. అలా బ్రిటన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఆ డబ్బును అప్పగించింది.
మాలిక్ రియాజ్ ఇమ్రాన్ ఖాన్తో ఒప్పందం కుదుర్చుకోవడంతోనే ఆ డబ్బును అతడి బ్రిటన్ అకౌంట్కు అప్పటి ప్రభుత్వం పంపించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. ఇందుకోసం అల్ ఖదీర్ ట్రస్టుకు భూమితో పాటు రూ.500కోట్ల డబ్బును మాలిక్ రియాజ్ ఇచ్చినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ను మే 9న అరెస్టు చేశారు.
తోషాఖానా కేసు
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందే కానుకలను ఇక్కడ భద్రపరచాలన్నమాట. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా అతడికి దాదాపు 100 కానుకలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన కానుకలేంటో చెప్పేందుకు నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకునేందుకు ఈసీకి లేఖ కూడా రాశారు.
ప్రభుత్వానికి రూ.2కోట్లు చెల్లించి రూ.10 కోట్ల విలువైన కానుకల్ని తీసుకున్నారని, అంతేకాకుండా మార్కెట్లో వాటిని అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ తోషాఖానా వివాదంపై 2022 ఆగష్టులో సంకీర్ణ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆశ్చర్యకర విషయం ఏటంటే ఇమ్రాన్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత తోషాఖానాలో పుస్తకాలు తప్ప ఏం మిగలలేదు. పాక్ కోర్టు సైతం ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేల్చింది.