వాషింగ్టన్: సామాజిక సంక్షేమ పథకాల నిర్వహణలో భాగంగా భారత ప్రభుత్వం నగదు బదిలీ స్కీమ్లను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకాల నిర్వహణ తీరు అద్భుతమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) అభిప్రాయపడింది. ఇండియా నుంచి ఎంతో నేర్చుకోవాలని, వివిధ దేశాల నుంచి కూడా కొన్ని అంశాలు నేర్చుకోవాల్సి ఉందని, ఇండియా విషయంలో నగదు బదిలీ స్కీమ్ ఓ లాజిస్టికల్ మార్వెల్ అని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ పావోలో మౌరో తెలిపారు. న్యూస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అంత పెద్ద దేశంలో.. తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది ప్రజలకు.. నగదు బదిలీ స్కీమ్ను నిర్వహిస్తున్న తీరు అద్భుతమని పావోలో మౌరో తెలిపారు. ఈ స్కీమ్ను భారత ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మహిళలను టార్గెట్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయని, వృద్ధులను, రైతులను ఉద్దేశిస్తూ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని, అయితే ఈ పథకాల నిర్వహణలో ఎంతో సాంకేతిక ఆవిష్కరణ కూడా ఇమిడి ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆధార్ ద్వారా ఇండియాలో పథకాలను అమలు చేస్తున్న విధానం చాలా విశిష్టంగా ఉన్నట్లు మౌరో తెలిపారు. చాలా దేశాల్లో మొబైల్ బ్యాంకింగ్ విధానం ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలను ప్రజలకు చేరవేసే విధానంలో భాగంగా ఐఎంఎఫ్తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రజలకు పథకాలను చేరవేసే విషయంలో టెక్నాలజీని భారత్ వాడుకుంటున్న తీరు స్పూర్తిదాయంగా ఉందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటార్ గాస్పర్ తెలిపారు.