దేశ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కోరారు. ముందస్తు ఎన్నికలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీని రద్దు చేయాలని నేను దేశ అధ్యక్షుడికి లేఖ రాశాను. ప్రజాస్వామిక విధానంలోనే ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని నేను ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్యంగా దేశంలో ఎన్నికలు జరిగితే ఎవరి భవిష్యత్తు ఏంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇక అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ వ్యతిరేకించడాన్ని ఇమ్రాన్ స్వాగతించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలన్న కుట్ర భగ్నమైందన్నారు. పాక్లో ఎలాంటి కుట్రలకు తావు లేదని స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను తిరస్కరించిన స్పీకర్
ప్రధాని ఇమ్రాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన ఓటింగ్ను డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అయితే స్పీకర్ అసద్ ఖైసర్ పైన కూడా ప్రతిపక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడంతో డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమయంలో మాత్రం సభలో ప్రధాని ఇమ్రాన్ లేరు. ఇక.. జాతీయ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఇమ్రాన్కు భారీ ఊరట కలిగినట్లైంది.