న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఈ సహస్రాబ్ది ప్రారంభం నుంచి హిందూ కుష్ హిమాలయ(హెచ్కేహెచ్) అంతటా విస్తరించి ఉన్న హిమానీనదాలు మరింత వేగంగా కరిగిపోతున్నాయని, మంచు నష్టం పరిమాణం రెట్టింపు అయ్యిందని హెచ్కేహెచ్ ప్రజల తరఫున పనిచేస్తున్న ఒక అంతర్ ప్రభుత్వ విజ్ఞాన, అధ్యయన కేంద్రం ఐదు నెలల క్రితం వెలువరించిన రెండు నివేదికలు వెల్లడించాయి. 1975 నుంచి హిమానీ నదాల మంచు మందం 27 మీటర్ల వరకు తగ్గిపోయిందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. కాఠ్మాండు కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్(ఐసీఐఎంవోడీ) ఈ నివేదికలను విడుదల చేసింది.
ఆసియా జలస్తంభాలు అని పిలిచే ప్రాంతాల్లో నీటిపై ఆధారపడి జీవిస్తున్న దిగువ ఉన్న దాదాపు 200 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఎదురవుతుందని ఆ నివేదికలు హెచ్చరించాయి. రెండు రోజుల క్రితం వందల మంది ప్రాణాలను బలిగొన్న నేపాల్ ఆకస్మిక వరదలకు అసలు కారణం ఏమిటనే దానిపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు దర్యాప్తు చేస్తుండగా వారిలో చాలామంది అనేక అంశాల కలయికే దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే అందులో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే 7వేల మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మంచు కురవడానికి బదులుగా వర్షం కురవడం. ఒకప్పుడు హిమపాతం నమోదైన ఎత్తైన ప్రాంతాలలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయని, అలాగే హిమానీనదాలు చాలా వేగంగా కరిగిపోతున్నాయని, దీనికి కారణం వాతావరణం వేడెక్కడమేనని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.